ద్వి భాషా చిత్రాలకు పెరుగుతున్న డిమాండ్

  • February 14, 2017 / 02:08 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ రోజురోజుకి విస్తరిస్తోంది. ఇతర భాషా చిత్రాలు ఇక్కడ విజయం సాధించడమే కొంతకాలం క్రితం వరకు చూసాం. ఇప్పుడు టాలీవుడ్ లో రూపొందే చిత్రాలు ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. అందుకే ఫిలిం మేకర్స్ అనువాదానికి బై బై చెప్పి, ద్వి భాషా పద్ధతికి తలుపులు తెరుస్తున్నారు. ఈ విధానం నిర్మాతకు లాభాలను పంచి పెడుతోంది. ఇలా ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కిన సినిమాలపై ఫోకస్..

సైజ్ జీరో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్వీటీ అనుష్కకి అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెను లీడ్ రోల్ గా పెట్టి ప్రకాష్ కోవెలమూడి సైజ్ జీరో అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో “ఇంజి ఇదుప్పజాజి” గా రిలీజ్ అయి విజయం సాధించింది.

ఊపిరి కింగ్ నాగార్జున టాలీవుడ్ లో స్టార్ హీరో. కోలీవుడ్ లో యువ నటుడు కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరిని కథానాయకులుగా పెట్టి వంశీ పైడిపల్లి ఊపిరి/తొజా అనే ద్వి భాష చిత్రాన్ని రూపొందించారు. టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది.

మనమంతా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇది వరకు స్ట్రైట్ తెలుగు చిత్రాల్లో కనిపించారు. అయితే కథానాయకుడిగా తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మనమంతా మూవీ చేశారు. దీనిని ఏకకాలంలో తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో విస్మయం గా రిలీజ్ అయి సక్సస్ సొంతం చేసుకుంది.

అనామిక బాలీవుడ్ లో హిట్ సాధించిన కహాని సినిమాను శేఖర్ కమ్ముల ఒకేసారి రెండు భాషల్లో చిత్రీకరించారు. తెలుగులో అనామికగా, తమిళంలో “నీ ఎంగే ఎన్ అంబే” గా విడుదల చేశారు. ఆశించినంతగా విజయం సాధించకపోయినప్పటికీ మంచి చిత్రంగా పేరు దక్కించుకుంది.

చీకటి రాజ్యం దేశంలో విశ్వనటుడు కమలహాసన్ గురించి తెలియని చిత్ర పరిశ్రమలేదు. తమిళంలో రూపొందే అయన సినిమాలు ఇతర భాషల్లో స్ట్రైట్ చిత్రమంతా విజయం సాధిస్తాయి. ఈ మధ్య కమల్ కూడా ద్విభాషా చిత్రాలకు మొగ్గుచూపుతున్నారు. ఆ విధంగా చీకటి రాజ్యాన్ని తెలుగు, తమిళం(తుంగ వనం)లో తెరకెక్కించారు. రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తుఫాన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో అడుగుపెట్టాలని అపూర్వ లఖియా దర్శకత్వంలో ద్విభాషా చిత్రాన్ని చేశారు. జంజీర్ /తుఫాన్ గా హిందీ, తెలుగులో రూపొందిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి నిరాశ పరిచింది.

ఎటో వెళ్లిపోయింది మనసు గౌతమ్ వాసుదేవ మీనన్ మెగా ఫోన్ నుంచి వచ్చిన మరో ప్రేమకథ చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు”. నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీ ద్విభాషా చిత్రం. తమిళంలో “నీదానే ఎన్ పోనవసంతం” గా రిలీజ్ అయి మంచి అనుభూతిని ఇచ్చింది.

కాంచన కొరియోగ్రాఫర్ నుంచి డైరక్టర్ అయి, హీరోగా ఎదిగిన రాఘవ లారెన్స్ తెలుగు, తమిళంలో ఒకే పేరుతో ద్విభాషా చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. హారర్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కిన “కాంచన” రెండు చోట్ల కలక్షన్ల వర్షం కురిపించింది.

రక్త చరిత్ర ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరక్టర్ గా గుర్తింపు సాధించుకున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాను ఏకకాలంలో రెండు భాషల్లో తీశారు. సూర్య, వివేక్ ఒబెరాయ్ తదితరులు నటించిన ఈ మూవీ తమిళంలో రక్త సరితిరం గా రిలీజ్ అయి విజయవంతమైంది

సాహసం శ్వాసగా సాగిపో ద్విభాషా చిత్రంలో కొంత మంది ఆర్టిస్టులు మారడం సహజం. కానీ గౌతమ్ మీనన్ హీరోనే మార్చివేసి ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించి మరో సారి హిట్ కొట్టారు. తెలుగులో యువసామ్రాట్ నాగ చైతన్యతో సాహసం శ్వాసగా సాగిపో, తమిళంలో శింబుతో “అఛ్చామ్ ఎంబాదు మదమయ్యాడా” గా తీశారు. ఇద్దరు హీరోలకు ఒకేసారి విజయాన్ని అందించారు. గతంలోనూ ఏమాయ చేసావే మూవీని ఇలాగే రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus