ఇషా రెబ్బా కి నటన అంటే ఎంత ఇష్టమో చెప్పిన డైరక్టర్

  • March 9, 2018 / 05:09 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ అతి తక్కువమంది ఉన్నారు. వారిలో ఇషా రెబ్బా ఒకరు. అమితుమీ సినిమా ద్వారా అందరి అభినందనలు అందుకున్న ఈ నటి  ‘అ!’ చిత్రంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. సున్నితమైన పాత్రలో ఆమె పలికించిన భావాలకు సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆమె డెడికేషన్ గురించి ‘అ!’ మూవీ డైరక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పారు. ” ఇషా రెబ్బా ‘అ!’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఒక రోజున ఆమెపై ఒక సీన్ ను చిత్రీకరిస్తున్నాను. ఆ సీన్ అంతా కూడా సింగిల్ షాట్ లో తీయాలని ప్లాన్ చేశాను.

డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ఒకటి రెండు డైలాగ్స్ మరిచిపోయింది. రెండవసారి డైలాగ్స్ చెబుతూ మధ్యలో ఆగిపోయింది. మళ్లీ డైలాగ్ మరిచిపోయి ఉంటుందని అనుకున్నాను. కానీ ఆమె ఏడుస్తోంది. అది ఎమోషనల్ సీన్ కావడంతో అలా ఏడుస్తోందని అనుకున్నాను. ఆమె నిజంగానే ఏడుస్తోందనే విషయం నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అప్పటికే ఆమెను నిత్యామీనన్ ఓదార్చుతోంది. నేను వెళ్లి విషయమేమిటని అడిగితే .. సీన్ లో ఇన్వాల్వ్ కావడం వలన అలా ఏడ్చేసినట్టు చెప్పింది. అందుకే సినిమాలో ఆ సీన్ చాలా రియల్ గా అనిపిస్తుంది ” అని ప్రశాంత్ వర్మ వివరించారు. ఆమెకు నటనపై ఉన్నఆసక్తి చూస్తుంటే ఎన్నో మంచి రోల్స్ దక్కించుకుంటుదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈషా రెబ్బా తేజ దర్శకత్వంలో నటిస్తోంది. నారా రోహిత్ కి జోడీగా కనిపించబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus