పాకిస్థానీయుల ఆహ్వానాన్ని మన్నించిన రాజమౌళి.!

  • March 28, 2018 / 08:21 AM IST

బాహుబలి సినిమాలు తెలుగువారి సత్తాని ప్రపంచానికి చాటాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బృందం ఐదేళ్లపాటు శ్రమించి రూపొందించిన ఈ చిత్రాలు నాలుగు భాషల్లో మనదేశంతో పాటు దుబాయ్, అమెరికాలో రిలీజ్ అయి సంచలనం సృష్టించాయి. కలక్షన్స్ పరంగానే కాకుండా అనేక ప్రాంతాల వారు బాహుబలి చిత్రానికి అరుదైన గౌరవం ఇచ్చారు. బాహుబలి-2 మూవీని పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా షో వేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి-2 స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. కొన్ని రోజుల కిందట రొమేనియాలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. మాస్కోలో కూడా సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రదర్శించారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఏ తెలుగు సినిమాకి దక్కని గౌరవం బాహుబలికి దక్కింది.

తాజాగా రాజ‌మౌళికి మ‌రో అరుదైన ఆహ్వానం అందింది. పాకిస్తాన్‌లో జ‌రిగే “పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌”లో పాల్గొనాలని రాజమౌళిని నిర్వాహకులు పిలిచారు. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. “ఎన్నో దేశాల్లో ప‌ర్య‌టించే అవ‌కాశం నాకు “బాహుబ‌లి” సినిమా క‌ల్పించింది. వాటన్నింటి కంటే మించి ఇప్పుడు పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించ‌బోతున్నా. క‌రాచీలో జ‌రిగే `పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌`కు నన్ను ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు” అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు. భారతీయులంటే మండి పడే పాకిస్తానీయులు రాజమౌళి ని ఆహ్వానించడం అందరూ గర్వపడే అంశమనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus