ఆనందం ఆశ్వాదించేలోపు అగ్గి బుగ్గి చేసింది!

  • November 15, 2017 / 09:56 AM IST

“కీడెంచి మేలెంచాలి” అని మన పెద్దలు ఊరికే అనలేదు. అంటే ఏదైనా పని మొదలుపెట్టేముందు అందువల్ల వచ్చే లాభాల కంటే ముందు నష్టాలను అంచనా వేయగలగాలి. మంచి నటుడు మాత్రమే కాక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అయిన నాగార్జున ఇప్పటివరకూ ఏ విషయంలోనూ లెక్క తప్పలేదు కానీ.. మొట్టమొదటిసారిగా తనకు అత్యంత ప్రీతిపాత్రమైన “మనం హౌస్” సెట్ విషయంలో మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్రావుతో కలిసి అక్కినేని కుటుంబ వారసులైన నాగార్జున, నాగచైతన్య, అఖిల్ మరియు అమల నటించిన సినిమా అయిన “మనం” చిత్రీకరించిన షూటింగ్ స్పాట్ కావడంతో “మనం లొకేషన్”ను నాగార్జున ప్రాణంగా చూసుకొనేవాడు. అయితే.. ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం “రాజుగారి గది 2” ప్రమోషన్స్, నాగచైతన్య-సమంతల పెళ్లి, రిసెప్షన్, అఖిల్ రెండో చిత్రం “హెల్లో” షూటింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో గత రెండు నెలలుగా యమ బిజీ అయిపోవడంతో “మనం హౌస్” గురించి సరిగా పట్టించుకోకుండా అన్నపూర్ణ స్టూడియోస్ మేనేజర్స్ కే వదిలేశాడట.

వారి నిర్లక్ష్యమో లేక మరో కారణమో తెలియదు కానీ.. “మనం హౌస్” మొత్తం బుగ్గిపాలై బూడిద మాత్రమే మిగిలింది. సరిగ్గా ఒకరోజు ముందు ఇండస్ట్రీ మొత్తం మీడియాతో సహా పిలిచి నాగచైతన్య-సమంతల రిసెప్షన్ ను అత్యంత ఘనంగా నిర్వహించిన నాగార్జున ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే ఇలా “మనం హౌస్” బూడిదవ్వడంతో మానసికంగానూ తీవ్రంగా బాధపడ్డారట. మరి తన తండ్రి మీద తనకున్న అపారమైన ప్రేమ-గౌరవాన్ని మనసులో పెట్టుకొని నాగార్జున మళ్ళీ “మనం హౌస్”ను రీక్రియేట్ చేస్తాడా లేక అంతకుమించిన అద్భుతమైన మరో సెట్ ను వేయిస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus