గోపి అతడిని సిద్ధం కమ్మన్నాడట..!

  • November 10, 2016 / 11:23 AM IST

హీరోగా చేసిన తొలి ప్రయత్నం ఫలించక విలన్ గా మారిన గోపీచంద్ కి ‘యజ్ఞం’ సినిమా మళ్ళీ హీరోగా నిలబెడితే పరిశ్రమలో ఇతగాడు పక్కా హీరో మెటీరియల్ అని నమ్మేలా చేసిన చిత్రం ‘ఆంధ్రుడు’. పరచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో గోపి హిట్ ట్రాక్ ఎక్కితే మురళికి ఇదే చివరి హిట్ సినిమాగా మిగిలిపోయింది. కొన్నాళ్లుగా గోపీచంద్-మురళీ కలయికలో మరో సినిమా వస్తుందన్న ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రంగ సిద్ధమవుతుందట.

నితిన్ తో చేసిన ‘రెచ్చిపో’, బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘అధినాయకుడు’ మురళికి హిట్ ఇవ్వలేకపోయాయి. దాంతో హిట్ కొట్టాలనే కసితో గోపీచంద్ హీరోగా ఓ కథ సిద్ధం చేసిన మురళీ ఆ కథను గోపీకి వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ‘ఆక్సిజన్’, సంపత్ నంది సినిమాలతో బిజీ అయిపోవడంతో ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యేదన్నది అనుమానంగా మారింది. పైగా మధ్యలో ఎప్పుడో ఆగిపోయిన బి.గోపాల్ సినిమా వచ్చి చేరింది. ఇప్పుడు రెండు సినిమాలు పూర్తి చేసిన గోపీచంద్ సంపత్ నంది సినిమాని జనవరి నాటికి పూర్తి చేయనున్నాడట. ఆ సినిమాకి గుమ్మడికాయ కొట్టగానే మురళీతో సినిమా మొదలెట్టనున్నాడు గోపీచంద్. ఈ మేరకు ఆ దర్శకుడికి కబురంపాడట. గోపీచంద్ తో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్న కేకే రాధామోహన్ ఈ సినిమాని నిర్మించనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus