నీలకంఠ స్థానాన్ని భర్తీ చేయనున్న ప్రశాంత్ వర్మ!

  • May 20, 2018 / 12:17 PM IST

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఘనంగా మొదలెట్టిన బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిమ్ “క్వీన్” సౌత్ రీమేక్ కు బోలెడన్ని అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొదట్లో ఈ రీమేక్ లో హీరోయిన్స్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్, మంజీమా మోహన్, తమన్నా, పరుల్ యాదవ్ ల డేట్స్ ఒకేసారి లండన్ షెడ్యూల్ కోసం సెట్ చేయడం మొదలుకొని ఒకేసారి ముగ్గురు దర్శకులు ఒకే షెడ్యూల్ లో నలుగురు హీరోయిన్స్ ను డైరెక్ట్ చేయడం వరకూ అన్నీ ఇబ్బందులే. తమిళ, మలయాళం, కన్నడ భాషల షూటింగ్స్ నిరాటకంగా కొనసాగుతుండగా.. తెలుగు వెర్షన్ షూటింగ్ మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలుగు వెర్షన్ డైరెక్టర్ నీలకంఠకు, తెలుగు వెర్షన్ కథానాయకి తమన్నాకు క్రియేటివ్ డిఫరెన్సస్ రావడంతో నిర్మాతలు కొన్నాళ్లపాటు తెలుగు వెర్షన్ షూట్ ను హోల్డ్ లో పెట్టారు.

తాజా సమాచారం ప్రకారం.. తెలుగు వెర్షన్ క్వీన్ ను “అ!” సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ 60% చిత్రీకరణ పూర్తవ్వడంతో ప్రశాంత్ వర్మ మిగతా పార్ట్ ను హ్యాండిల్ చేయడంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దగ్గరుండి మరీ చూసుకోనున్నాడు. మరి ఒక సీనియర్ దర్శకుడు మధ్యలో వదిలేసిన ప్రొజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus