విశాల్, కార్తీల పై రాధిక చురకలు

  • September 16, 2016 / 11:07 AM IST

సీనియర్ నటి రాధిక యువ హీరోలు విశాల్, కార్తీల తీరుని విమర్శిస్తున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఆలోచించాలని హితవు పలికారు. తీరు ఏమిటి?, నిర్ణయం ఏమిటి ? అని అనుకుంటున్నారా ? అయితే అసలు విషయంలోకి వెళదాం. రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ పదేళ్లుగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. దీనిని న‌డిగ‌ర్ సంఘం అని పిలుస్తుంటారు. ఈ సంఘానికి రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో శ‌ర‌త్‌కుమార్ అండ్ టీంపై విశాల్, కార్తీ టీం విజ‌యం సాధించింది. ఈ సంగం నిధులను శరత్ కుమార్, మాజీ కోశాధికారి చంద్ర‌శేఖ‌ర్‌,మాజీ కార్య‌ద‌ర్శి రాధార‌వి లు కాజేశారని, 100 కోట్లు తినేశారని సంఘం లో వారి సభ్యత్వాన్ని కొత్త నాయకులు తొలిగించారు.

దీనిపై  గత రెండురోజులుగా పోలీసులతో విచారణ జరిగింది. అన్ని లెక్కలు చూసిన తర్వాత 1.65 కోట్లు మాత్రమే కనిపించడం లేదని తేల్చారు. దీంతో శరత్ కుమార్ భార్య రాధికా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫైర్ అయ్యారు. “ముందు వంద‌కోట్ల మోసం జ‌రిగింద‌న్నారు. ఇప్పుడేమో 1.65 కోట్లంటున్నారు. ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా?” అంటూ విశాల్ , కార్తిలను ప్రశ్నించారు. “ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు వివ‌ర‌ణ కోరకుండా వారి ప్రాథ‌మిక స‌భ్య‌త్వాల‌ను ఎలా తొలగించారు? మ‌న‌సులో ఇంత ద్వేషం పెట్టుకున్నారా?”  అని విరుచుకు పడ్డారు. “చివరకు ఏమైంది. ఇప్పుడు నిజం తెలిసింది. అయినా మాపై వేసిన ఆరోపణ మచ్చను తుడిచేయగలరా?” అని అడిగారు. దీనిపై విశాల్‌, కార్తీ లు ఇంకా స్పందించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus