త్రివిక్రమ్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న రచయిత

  • October 9, 2018 / 09:59 AM IST

సినిమాలకు మాటల రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసినవారు డైరక్టర్ గా మారి హిట్స్ అందుకుంటున్నారు. త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి.. ఇలా చాలామంది దర్శకత్వం వైపు వెళ్లిపోతున్నారు. అటువంటి సమయంలో దూసుకొచ్చిన రచయిత సాయి మాధవ్ బుర్రా. ప్రాసల జోలికి వెళ్లకుండా హృదయాలకు తాకేలా మాటలు రాస్తుంటారు. అందుకే అతను మాటలను అందించిన కృష్ణం వందే జగద్గురుమ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 , మహానటి.. సినిమాలు విజయతీరాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు అతను బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి, మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రాలకి మాటలను అందిస్తున్నారు.

ఇంత బిజీలో ఉన్న రచయితని రాజ‌మౌళి పిలిచి ఛాన్స్ ఇచ్చారు. బాహుబలి తర్వాత తాను తెరకెక్కిస్తున్న #RRR చిత్రానికి మాటలు రాయమన్నారు. డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి 75 ల‌క్ష‌లు అడిగారంట. అందుకు ఓకే అన్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఒక సినిమాకి 30 నుంచి 40 ల‌క్ష‌లు తీసుకునే బుర్రా సాయిమాధ‌వ్ రెమ్యునరేషన్ 75 ల‌క్ష‌లకు చేరడంతో అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అప్ప‌ట్లో త్రివిక్ర‌మ్ ఒక్కో సినిమాకీ కోటి రూపాయ‌లు పారితోషికం అందుకునేవారు. ఆ స్థాయి కోన వెంక‌ట్‌కీ వ‌చ్చింది. ఆ తర్వాత సాయి మాధవ్ అందుకునేట్టు ఉన్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus