2.o సినిమా టీజర్ ను లీక్ చేసిన వారిపై మండి పడ్డ రజనీ కుమార్తె!

  • March 5, 2018 / 06:32 AM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమర్షియల్ డైరక్టర్ శంకర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న  కళాఖండం 2 .o.  బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 500 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ముంబయిలో, ఆడియోను అబుదబిలో విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే లీకు రాయుళ్లు ఈ టీజర్ ను ఆన్లైన్లో పెట్టేసారు. నిన్నంతా ఈ టీజర్ సోషల్ మీడియాలో షికారు చేసింది. ఈ లీక్ ఎలా జరిగిందో కనిపెట్టే పనిలో చిత్ర బృందం నిమగ్నమవ్వగా.. రజినీ కుమార్తె సౌందర్య మాత్రం ట్విట్టర్ వేదికపై ఘాటుగా స్పందించారు.

ఎంతోమంది ఎన్నో రోజులుగా పడిన కష్టం మీకు కనిపించలేదా? అంటూ లీకు రాయుళ్ళపై మండిపడ్డారు. ఈ చర్య పనికిమాలినదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సహించకూడదని.. ఎవరూ ప్రోత్సహించకూడదని సినిమా పెద్దలను, అభిమానులను కోరారు. స్టాప్ పైరసీ, బీ అషేమ్డ్, స్టాప్ మిస్ యూజింగ్ పైరసీ అంటూ యాష్ ట్యాగులతో తన ఆవేదనను వెల్లడించారు. భారీ అంచనాలున్న ఈ సినిమాని ఏప్రిల్ 27 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేశారు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus