సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్న చిరంజీవి

  • December 6, 2016 / 12:40 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా కథ ఎంపికలో కాస్త టైమ్ తీసుకున్నారు కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో ఆలస్యం చేయడం లేదు. ఖైదీ నంబర్ 150 షూటింగ్ లో ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్టులకు డైరెక్టర్లను డిసైడ్ చేస్తున్నారు. 151వ మూవీని మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో చేయనున్నారు. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, అశ్వినీదత్ కలిసి నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో మెగాస్టార్ 152 వ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్ట్ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాజక్ట్ గురించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి. తాజాగా సురేందర్ రెడ్డి చిరు కి కథ చెప్పానని వెల్లడించి మెగా అభిమానులను ఆశ్చర్య పరిచారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆయన చేసిన ధృవ రిలీజ్ కి ముందే మంచి టాక్ తెచ్చుకుంది. హిట్ పక్కా అని టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తనయుడి చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విధానం చూసి అతనితో సినిమా చేసేందుకు మెగాస్టార్ ఆసక్తిగా ఉన్నట్లు ఫిలిం నగర్ వాసులు వెల్లడించారు. అయితే బోయపాటి, త్రివిక్రమ్ సినిమాల తర్వాత ఈ చిత్రం చేస్తారా? లేకుంటే ముందుగానే మొదలు పెడుతారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సురేందర్ రెడ్డి మాత్రం వచ్చే ఏడాది చివర్లో తన సినిమా సెట్స్ మీదకు వెళుతుందని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ధీమాగా చెప్పారు. ధృవ బ్లాక్ బస్టర్ అయితే బాస్ తో వెంటనే సురేందర్ రెడ్డి సినిమా చేసే అవకాశం కొట్టేస్తారని సినీ పండితులు భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus