మహానటి చిత్రంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన తమ్మారెడ్డి!

  • June 5, 2018 / 05:31 PM IST

అభినేత్రి సావిత్రి జీవితంపై నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ మే 9న రిలీజ్ అయి సంచల విజయం సాధించింది.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. సావిత్రిగా కీర్తి సురేష్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ లు ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని చూసిన చాలామంది ప్రశంసలు గుప్పిస్తున్నారు.

అయితే జెమినీ గణేష్ ని విలన్ గా చూపించారంటూ అతని మొదటి భార్య కుమార్తెలు ఆరోపిస్తున్నారు.  తెలుగు నటీనటులు కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. సావిత్రి కుమార్తె కూడా గొడవకి దిగింది. ఈ వివాదం రోజురోజుకి పెరిగిపోతోంది. దీనిపై ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. “దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించారు. సావిత్రి పాత్రను ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఒకటి రెండు సీన్స్ మినహా జెమినీ గణేశన్ పాత్రను కూడా పాజిటివ్ గానే చూపించాడు. అంతే కాదు జెమినీ గణేషన్ మొదటి భార్య పాత్రను కూడా గౌరవంగా చిత్రీకరించారు.

ఎక్కడ కూడా ఆమె స్థాయి తగ్గకుండా తెరకెక్కించారు. ఈ విషయాన్ని జెమినీ గణేశన్ కూతుళ్లు గమనించాలి. సినిమా అన్న తర్వాత కొన్ని కల్పిత సన్నివేశాలు ఉండటం సహజం.. అలా అని అన్నీ నెగిటివ్ గా తీసుకోవద్దు” అని అన్నారు. “ఒక మంచి సినిమాను చూశామని అనుకోవాలే గానీ .. ఒకరినొకరు తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటివరకూ కలిసున్న మీరు ఈ కారణంగా విడిపోవడం మాకు ఇష్టం లేదు” అని జెమిని గణేశన్ కూతుళ్లకు సూచించారు. ఇంతటితో ఈ గొడవలు ఆగుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus