బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకిన మత్తు

  • July 15, 2017 / 11:16 AM IST

బాలీవుడ్ చూసి టాలీవుడ్ అనేక విషయాలు నేర్చుకుంది. అందులో డ్రగ్స్ కూడా చేరిందని ఇప్పుడే తెలిసింది. హిందీ చిత్ర పరిశ్రమకు, డ్రగ్స్‌ మార్కెట్‌కు మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. కేవలం వినియోగమే కాదు విక్రయంలోనూ ముందుటున్నారని సమాచారం. బాలీవుడ్‌లో 1970ల్లోనే ఈ డ్రగ్స్‌ మాఫియా బయటపడింది. అప్పటి హీరోయిన్స్ పర్వీన్‌బాబీ, ప్రతిమా బేడీలు ఈ విషయాన్ని బహిరంగంగానే  అంగీకరించారు. సంజయ్‌దత్‌ సైతం ఈ వ్యవహారంలో ఇరుక్కొని వార్తల్లో నిలిచారు. అలాగే బాలీవుడ్‌ హీరో ఫర్దీన్‌ఖాన్‌ కొకైన్‌ తో 2001లో ముంబై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు చిక్కాడు. అక్కడ పట్టుబడిన డ్రగ్‌ డీలర్‌ కరీమ్‌షేక్‌ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. అక్కడ దందా కష్టమైందని డ్రగ్ విక్రయదారులు టాలీవుడ్ మీదకు వచ్చారు.

ఇక టాలీవుడ్ లో తొలిసారి 2010 ఏప్రిల్‌లో డ్రగ్ వాడకం వెలుగు చూసింది. ఎఫిడ్రిన్‌ స్మగ్లింగ్‌ కేసులో సినీ నిర్మాత వెంకటేశ్వరరావు మాదాపూర్‌ పోలీసులకు చిక్కారు. సినీ నటుడు రవితేజ సోదరులైన రఘు, భరత్‌లు మాదకద్రవ్యాల కేసులో చిక్కినప్పుడు ఓసారి ఇలానే కలకలం రేగింది. అప్పట్లో వీరికి కొకైన్‌ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా వాసి క్లెమంట్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా డ్రగ్స్‌ వినియోగిస్తున్న సెలబ్రెటీలపై పోలీసులకు ఓ అవగాహన వచ్చింది. తాజాగా ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన ముఠాలో కీలకంగా ఉన్న కెల్విన్‌ కాల్‌ డేటా ఆధారంగా పలువురు సినీ తారలకు నోటీసులు జారీ చేశారు. అయితే కేవలం నిందితుల ఫోన్, కాల్‌ డిటేల్స్‌లో ఉన్న నెంబర్ల ఆధారంగా అనుమానితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని పోలీసులు చెప్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus