శ్రీదేవి జీవితం గురించి మీకు తెలియని విషయాలు!

  • July 8, 2020 / 12:05 PM IST

“శ్రీదేవి ఎవర్రా?” అంటే “వేటగాడు, జగదేక వీరుడు అతిలోక సుందరి” సినిమాల్లో హీరోయిన్ అనో, బోణీకపూర్ భార్య అనో, రాంగోపాల్ వర్మ ప్రేమించిన ఏకైక మహిళ అనో చెబుతారు. కానీ.. తల్లి మాట జవదాటని కూతురు అని తెలుసా?, తండ్రి చనిపోయాడన్న విషయం తెలిసి కూడా నిర్మాతకు నష్టం రాకూడదని షూటింగ్ కంప్లీట్ చేసి మరీ వెళ్ళిన ధీశాలి అని తెలుసా?, తల్లీదండ్రులు చనిపోయాక తానే ఇంటిపెద్దగా మారి చెల్లెల్ని అక్కున చేర్చుకొని సాకిందని తెలుసా?. రోమాంటిక్ హీరోయిన్ ఆఫ్ ది డెకేడ్ అనిపించుకొన్న శ్రీదేవికి రోమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం రాదు అన్న విషయం తెలుసా?, హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉండగా చెల్లెలి కోసం నిర్మాతగా మారి కోట్ల రూపాయలు నష్టపోయిందని తెలుసా?.. ఇలా శ్రీదేవి జీవితంలో మీకు తెలియని చాలా కోణాలున్నాయి. ఆమెను నిన్నమొన్నటివరకూ నటిగా ఆరాధించారు, కానీ నేడు ఆమె మన మధ్య లేరు. నిన్న అర్ధరాత్రి గుండెపోటు కారణంగా దుబాయ్ లో తుదిశ్వాస విడిచారు. అందుకే శ్రీదేవి గురించి నటిగా కంటే ఒక వ్యక్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలు-విశేషాలు మీకోసం…!!

పొరపాటున ఫంక్షన్ కి వెళ్ళి నటి అయ్యింది…
1963, ఆగస్ట్ 13, మంగళవారం నాడు మద్రాసులోని శివకాశీలో పుట్టిన అమ్మాయి శ్రీ అమ్మ అయంగర్ ( శ్రీదేవి). నాలుగేళ్ల వయసులోనే తమ చిన్నాన్న వెళ్లాల్సిన ఒక ఫంక్షన్ కి అనుకోకుండా వెళ్లాల్సి రావడం అక్కడ ఒక కన్నడ కవి చిన్నారి శ్రీదేవిని చూసి ముచ్చటపడి “మీ పాపకి సినిమాలో అవకాశం ఇస్తాను” అని శ్రీదేవి తండ్రికి చెప్పడం.. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన శ్రీదేవి తండ్రి ముందు వద్దనుకొన్నా.. తల్లి మాత్రం శ్రీదేవిని ఎంకరేజ్ చేయడంతో మొట్టమొదటిసారి నాలుగేళ్ల ప్రాయంలో చిన్నారి అయ్యప్పస్వామిగా “తునైవాన్” (1967) వెండితెరపై మెరిసింది శ్రీదేవి.

పదేళ్ళు నిండకుండానే బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది…
ఒక సినిమా షూటింగ్ సమయంలో ఎమ్.జి.రామచంద్రన్ శ్రీదేవిని చూసి “నమ్ నాడు” అనే చిత్రంలో నటింపజేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమె జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. దాంతో స్కూల్ కి వెళ్ళడం కూడా కష్టమయ్యేది. పదేళ్ళ ప్రాయంలోనే శ్రీదేవి రోజుకి మూడు షిఫ్టుల్లో వర్క్ చేసేది.

చదువుకి దూరమవ్వకూడదని సెట్ లోనే ట్యూటర్…
శ్రీదేవి తండ్రి ఆమె కెరీర్ పట్ల కంటే ఆమె వ్యక్తిగత జీవితం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు. ఆమె నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. చదువు పక్కనేట్టకూడదని ఆమె కోసం సెట్ లో ఒక ట్యూటర్ ని ఏర్పాటు చేశారు. సో, స్కూల్ కి దూరమైనా షూటింగ్ గ్యాప్ లో చదువుకొనేది.

తల్లి మాట ఎన్నడూ జవదాటలేదు…
పైకి చాలా గంభీరంగా కనిపించే శ్రీదేవి చాలా భయస్తురాలు. తల్లి మాట వేదవాక్కులా భావించేది. చిన్నప్పట్నుంచి తల్లంటే విపరీతమైన అభిమానం. ఒకసారి శ్రీదేవి తల్లి ఆమెను ఓ గోడపై కూర్చోబెట్టి “ఇక్కడే కూర్చో” అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి.. శ్రీదేవిని గోడ మీద కూర్చోబెట్టి వచ్చేశాను అన్న విషయం మర్చిపోయి ఇంటి పనిలో నిమగ్నమైపోయింది. నాలుగైదు గంటల తర్వాత ఇంట్లో శ్రీదేవి కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతికి చూస్తే.. అలా గోడ మీద బిక్కు బిక్కు మంటూ కూర్చున్న శ్రీదేవిని చూసి నిర్ఘాంతపోయిందట.

టీనేజ్ లోనే సూపర్ స్టార్…
రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన.. బాలచందర్, భారతీరాజా వంటి స్టార్ డైరెక్టర్ల నేతృత్వంలో నటించారు శ్రీదేవి. పద్నాలుగేళ్ల ప్రాయంలోనే 20 ఏళ్ల అమ్మాయిగా నటించింది. సినిమాలో ఆమెను చూసిన ప్రేక్షకులు “ఈ అమ్మాయి వయసు 14/15 ఏళ్ళా ??” అని షాక్ అయ్యేవారు.

హాస్పిటల్ లో చేర్పించిన రాఘవేంద్రరావు…
శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో శ్రీదేవి దాదాపు 24 (తెలుగు-15, హిందీ-9) సినిమాల్లో నటించింది. మొదటిసారి ఆయన శ్రీదేవిని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా చూశారు. “నా తమ్ముడు” షూటింగ్ టైమ్ లో మౌంట్ రోడ్డు క్రాస్ చేసే షాట్ లో శ్రీదేవి నిజంగానే కార్ ను గుద్దుకొంది. అప్పుడు రాఘవేంద్రరావు శ్రీదేవిని తన స్వహస్తాలతో ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను కథానాయికగా “పదహారేళ్ళ వయసు” సినిమాలో కథానాయికగా ఎంపిక చేసుకొన్నారు రాఘవేంద్రరావు.

రెండు క్లైమాక్స్ ల పదహారేళ్ళ వయసు…
“పదహారేళ్ళ వయసు” సినిమాని మొదట భారతీరాజా తమిళంలో తెరకెక్కించారు. కమల్ హాసన్ హీరోగా నటించగా.. విలన్ గా రజనీకాంత్ ముఖ్యపాత్ర పోషించిన సినిమా అది. ఆ సినిమాకి తమిళ ప్రేక్షకుల మనోభావాలకి తగ్గట్లుగా సాడ్ ఎండింగ్ ఇచ్చారు భారతీరాజా. అయితే.. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన రాఘవేంద్రరావు మాత్రం ఆ క్లైమాక్స్ ను మార్చారు. అక్కడ కమల్ హాసన్-శ్రీదేవి చివరికి కలవరు. కానీ.. తెలుగులో శ్రీదేవి-చంద్రమోహన్ కలుసుకొంటారు.

రోమాంటిక్ ఎక్స్ ప్రెషన్ పెట్టడం వచ్చేది కాదు…
శ్రీదేవిని అందరూ అప్పట్లో రోమాంటిక్ హీరోయిన్ అని పిలుచుకొనేవారు. నిజానికి ఆమెకు రోమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం సరిగా రాదు. బాలచందర్ సినిమాలో నటిస్తున్న టైమ్ లో శ్రీదేవి రోమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదన్న కోపంతో షూటింగ్ ప్యాకప్ చెప్పేసారాయన. తర్వాత శ్రీదేవి ఇంటికెళ్ళి “అమ్మాయికి కాస్త రొమాంటిక్ మూవీస్ చూపించండి” అని చెప్పారట. ఎన్ని సినిమాలు చూసినా శ్రీదేవి కెమెరా ముందు రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేకపోయింది. దాంతో “నువ్వు కెమెరా ముందు కాస్త ఏడుస్తున్నట్లు కనిపించు చాలు” అన్నారట. ఆ తర్వాత నుంచి రోమాంటిక్ సీన్స్ లో నటించాల్సి వచ్చినప్పుడల్లా శ్రీదేవి అదే ఫాలో అయ్యేదట.

ఎన్టీయార్ పక్కన మానవరాలిగా, ప్రేయసిగా…
సీనియర్ ఎన్టీయార్ తో కలిసి “బడిపంతులు” (1972) అనే చిత్రంలో మానవరాలిగా నటించిన శ్రీదేవి.. తదనంతరం “వేటగాడు” (1979)లో కథానాయికగా నటించింది. శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ ని రాఘవేంద్రరావు చెప్పినప్పుడు ఎన్టీయార్ “ఏంటి ఆ అమ్మాయి అప్పుడే అంత పెద్దదైపోయిందా?” అని అడిగారాట. ఆ తర్వాత ఎన్టీయార్ తో కలిసి 12 సినిమాల్లో నటించింది శ్రీదేవి.

ఏయన్నార్ కి కూతురిగా నటించింది…
1973లో వచ్చిన “భక్త తుకారాం” అనే చిత్రంలో శ్రీదేవి టైటిల్ పాత్రధారి ఏయన్నార్ కి కూతురిగా నటించింది. ఆ తర్వాత 1981లో “ప్రేమాభిషేకం” చిత్రంలో కథానాయికగా నటించింది. ఏయన్నార్ కాంబినేషన్ లోనూ 10 సినిమాల్లో నటించింది శ్రీదేవి.

చిరంజీవి విలన్ గా ఉన్నప్పట్నుంచి…
చిరంజీవి సరసన “రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్.పి.పరశురామ్” చిత్రాల్లో శ్రీదేవి కథానాయికగా నటించిన విషయమే అందరికీ తెలుసు. కానీ.. చిరంజీవి విలన్ గా నటించిన రెండు సినిమాల్లోనూ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. “మోసగాడు” (1980), “రనువ వీరన్” (1981) చిత్రాల్లో చిరంజీవి విలన్ గా నటించారు. శ్రీదేవి బాలీవుడ్ లో సెటిల్ అయ్యాక తన చెల్లెలు శ్రీలతను నిర్మాతగా పెట్టి చిరంజీవి హీరోగా “వజ్రాల దొంగ” చిత్రాన్ని మొదలెట్టారు. భారీ బడ్జెట్ తో తీదామనుకొన్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ తోనే కారణాంతరాలవలన ఆగిపోయింది.

నాగార్జున, వెంకటేష్ ల సరసన కూడా…
నాగార్జున సరసన “ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా” చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. వెంకటేష్ తో కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించింది. అదే “క్షణ క్షణం”. వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్. అయితే.. పేరుకి ఈ సినిమాలో హీరో వెంకటేష్ అయినా.. కథ మొత్తం శ్రీదేవి చుట్టూనే తిరగడం వలన ఒకానొక సందర్భంలో ఈ సినిమాలో హీరో శ్రీదేవి, నేను జస్ట్ పక్కన నటించాను అని వెంకటేష్ కూడా పేర్కొనడం విశేషం.

“లమ్హే” షూటింగ్ టైమ్ లో తండ్రిని కోల్పోయింది..
అప్పటికి శ్రీదేవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఫామ్ లో ఉంది. “గురుదేవ్, రూప్ కి రాణి చోరోంకా రాజా, లమ్హే” చిత్రాలు వరుసబెట్టి షూటింగ్ జరుపుకొంటున్నాయి. “లమ్హే” షూటింగ్ టైమ్ లో తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. అయితే.. వెంటనే బయలుదేరకుండా నిర్మాతకి నష్టం రాకూడదే ఉద్దేశ్యంతో ఆరోజు షూటింగ్ పూర్తి చేసుకొని మద్రాసు వెళ్ళి.. తండ్రి అంత్యక్రియల కార్యక్రమాలను పూర్తి చేసి, మళ్ళీ షూటింగ్ లో పాల్గొని అనుపమ్ ఖేర్ తో ఒక కామెడీ సీన్ లో యాక్ట్ చేసిన శ్రీదేవిని చూసి యూనిట్ సభ్యులందరూ నివ్వెరపోయారు.

తదనంతరం తల్లిని కోల్పోయింది..
తండ్రి మరణించిన కొన్నాళ్లకే తల్లి అనారోగ్యం కారణంగా మంచానపడగా ఆమెకు ట్రీట్ మెంట్ కోసం న్యూయార్క్ తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. యుక్త వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన శ్రీదేవి ఇంటిపెద్ద బాధ్యతను తీసుకొంది. సొంత చెల్లెలు శ్రీలత, స్టెప్ బ్రదర్ సతీష్ ను అక్కున చేర్చుకుంది. తానే వారిద్దరికీ తల్లై.. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, కుటుంబ క్షేమాన్ని కూడా చూసుకొనేది.

బోణీకపూర్ తో ప్రేమ పెళ్లి..1984లో నన్ను హీరోయిన్ గా పెట్టి “మిస్టర్ ఇండియా” తీసినప్పటినుంచే బోణీకపూర్ నన్ను ప్రేమించారట. అయితే.. ఎన్నడూ ఆమెకు చెప్పలేదు. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న టైమ్ లో ఆమె వెన్నంటి ఉన్నది బోణీకపూర్ మాత్రమే. శ్రీదేవి నైరాశ్యంతో బాధపడుతున్న తరుణంలో బోణీ పంచన చేర్చుకొని పెళ్లి చేసుకొంటానని అడగగా.. అప్పటికే ఆయన మంచితనం గురించి తెలిసిన శ్రీదేవి వెంటనే ఒకే చెప్పేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తిపలికి కుటుంబానికి అంకితమైపోయింది.

దేవుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు సృష్టించిన రూపమే శ్రీదేవి – రాంగోపాల్ వర్మ
చిత్రపరిశ్రమలో శ్రీదేవి ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు. కానీ రాంగోపాల్ వర్మ శ్రీదేవి మీద పెంచుకొన్న అభిమానం ముందు ఎవ్వరూ నిలువలేరు. అసలు వర్మ ఇండస్ట్రీకి వచ్చిందే శ్రీదేవిని దగ్గర నుంచి చోడొచ్చని. అలాగే కేవలం శ్రీదేవి దృష్టిలో పెట్టుకొనే “క్షణక్షణం” కథ రాసుకొన్నాడు ఆర్జీవి. వర్మ మనస్ఫూర్తిగా శ్రీదేవికి రాసిన ప్రేమలేఖ “క్షణక్షణం చిత్రం”. ఆ సినిమాలోని “జామురాతిరి జాబిలమ్మ..” పాట ఇప్పుడు చూసినా తెలియని పరవశంతో మనసు ఉప్పోంగిపోతుంటుంది.

శ్రీదేవికి తీరని కోరికలు..
రాఘవేంద్రరావు దర్శకత్వంలో 24 చిత్రాల్లో కలిసి నటించిన శ్రీదేవికి ఆయన దర్శకత్వంలో 25వ సినిమాలో నటించి వారిద్దరి కాంబినేషన్ లో సిల్వర్ జూబ్లీ సినిమా రావాలని ఆశపడింది. అలాగే.. తన కుమార్తె జాహ్నవి కపూర్ ను హీరోయిన్ గా వెండితెరపై కూడా చూడాలనుకొంది. అయితే.. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా మరాఠీ సూపర్ హిట్ చిత్రం “సైరత్”ను హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైనా.. ఆ సినిమా విడుదలలోపే ఆమె మరణించడం విషాదకరం.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus